2022.. భారత్కు ఇది చాలా ప్రముఖమైన ఏడాది. ఆ ఏడాదితో భారత్ స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా తొలిసారి ఓ భారతీయుడిని అంతరిక్షంలో పంపే మిషన్ను చేపట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన తర్వాత మోదీ ప్రసంగించారు. ఇండియా 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే 2022 లేదా ఆలోపే ఓ భారతీయుడు చేతిలో త్రివర్ణ పతకాన్ని పట్టుకొని అంతరిక్షంలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇప్పటివరకు అమెరికా, యూఎస్ఎస్ఆర్, చైనా మాత్రమే అంతరిక్షంలోకి మనిషిని పంపించాయి. 2022లో డెన్మార్క్ కూడా అంతరిక్షంలోకి మనిషి పంపే ఏర్పాట్లు చేస్తున్నది.
నిజానికి పదేళ్ల కిందటే వ్యోమ్ పేరుతో మనిషిని అంతరిక్షంలోకి పంపే ప్రాజెక్ట్ను ఇస్రో ప్రకటించింది. ముగ్గురు క్రూ మెంబర్లతో కూడిన స్పేస్క్రాఫ్ట్ను మార్క్ జీఎస్ఎల్వీ 3 లాంచ్ వెహికిల్ ద్వారా భూకక్ష్యలోకి పంపించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు నుంచి ఏడు రోజుల పాటు భూకక్ష్యలో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆ ఆర్బిటల్ వెహికిల్ను రూపొందించే పనిలో ఇస్రో ఉంది. 2007లోనే తొలిసారి 550 కేజీల శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపించి 12 రోజుల తర్వాత తిరిగి భూమికి తీసుకొచ్చే ప్రయోగ పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. రీఎంట్రీ టెక్నాలజీలో ఇండియా సామర్థ్యం ఏంటో అప్పుడే బయటపడింది. ఇక ఈ ఏడాది జులైలో క్రూ ఎస్కేప్ సిస్టమ్ను కూడా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సక్సెస్ఫుల్గా పరీక్షించి చూసింది. ఇప్పటికే ఇండియా చంద్రుడు, అంగారకుడిపైకి విజయవంతంగా స్పేస్క్రాఫ్ట్లను పంపించిన విషయం తెలిసిందే.