ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరు, పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత అశుతోష్ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ‘ప్రతి ప్రయాణానికి ముగింపు ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో నా అనుబంధం చాలా అందమైంది. విప్లవాత్మకమైనది. దీనికి కూడా ముగింపు ఉంటుంది. పార్టీకి రాజీనామా చేశాను. నా రాజీనామాను అంగీకరించాలని కోరాను. వ్యక్తిగతమైన కారణాల వల్ల తప్పుకుంటున్నాను. పార్టీకి, నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’ అని అశుతోష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇంకా ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదని, తన ప్రైవసీని కాపాడాలని, తనకు సహకరించాలని మీడియా మిత్రులను కోరారు.
రాజకీయాల్లోకి రాకముందు అశుతోష్ టీవీ జర్నలిస్ట్గా చాలా ఏళ్లు పనిచేశారు. అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2014 లోక్సభ ఎన్నికల్లో దిల్లీలోని చాందినీ చౌక్ నుంచి ఆప్ టికెట్పై పోటీ చేసి భాజపా నేత హర్షవర్ధన్ చేతిలో ఓడిపోయారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్స్ సమయంలో కేజ్రీవాల్ ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థుల విషయంలో అశుతోష్ సహా చాలా మంది పార్టీ నేతలు అసంతృఫ్తి వ్యక్తం చేశారు. అశుతోష్కు అవకాశం వస్తుందని ఆశించారు కానీ రాలేదు. అప్పటి నుంచి అశుతోష్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం పార్టీ సీనియర్ నేత, వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ ఆప్కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.