ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శనివారం వరకు కొచ్చి విమానాశ్రయం మూసివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 15, 2018, 12:47 PM

భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ పరిస్థితి ఘోరంగా మారిపోయిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉండడంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంకా కురుస్తున్న వర్షాల కారణంగా కొచ్చి విమానాశ్రయ సమీపంలోనూ నీటి మట్టం పెరిగిపోతోంది. దీంతో అధికారులు కొచ్చి విమానాశ్రయాన్ని శనివారం మధ్యాహ్నం వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడి నుంచి అన్ని విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్ల తెలిపారు. ‘కొచ్చి విమానాశ్రయ ఆపరేషన్స్‌ను 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు తాత్కాలికంగా నిలిపేస్తున్నాం. వరద నీటిని విమానాశ్రయం నుంచి తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం’ అని విమానాశ్రయ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. తొలుత విమానాశ్రయ అధికారులు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు విమానాల రాకపోకలు నిలిపేస్తున్నట్లు తెలిపారు. కానీ కొంత సేపటి తర్వాత మరో మూడు రోజుల పాటు విమానాశ్రయం మూసేస్తున్నట్లు ప్రకటించారు.


 


భారీ వరదల కారణంగా రాష్ట్రంలోని చాలా ఆనకట్టల గేట్లు ఎత్తేశారు. ఇడుక్కి రిజర్వాయర్‌కు చెందిన రెండు ఆనకట్టల గేట్లను ఎత్తేసినందున వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని కొచ్చి విమానాశ్రయ అధికారులు కొద్ది రోజుల పాటు విమానాల రాకపోకలు నిలిపేయాలని నిర్ణయించారు. ముల్లపెరియార్‌ ఆనకట్టలో వరద 140 అడుగుల ఎత్తుకు వచ్చేయడంతో ఈరోజ తెల్లవారుజామున రెండున్నరకు గేట్లను ఎత్తారు. పెరియార్‌ నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వందలాది మంది ప్రజలను సహాయక సిబ్బంది పునరావాస శిబిరాలకు తరలించారు. వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో సంభవించిన ఈ విపత్తు కారణంగా రాష్ట్ర ప్రజలు ఓనం ఉత్సవాలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కోరారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం కేటాయించే రూ.30కోట్లను కూడా సహాయ నిధికి మళ్లిస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com