న్యూఢిల్లీ: భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం తన అధికారిక నివాసం నుంచి బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట సమీపంలో తన వాహనం నుంచి దిగిన మోదీ... త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తూ కోటపైకి చేరుకున్నారు. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు విచ్చేశారు.