అనంతపురం : ఆత్మహత్య చేసుకున్న తమ బిడ్డ మృతికి ప్రిన్సిపల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ శనివారం విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు, ప్రజా సంఘాలు కాలేజి వద్ద నిరసన చేశారు. వివరాల్లోకెళితే.. రూరల్ పరిధిలో ఉన్న ఎస్ఎల్ఎన్ జూనియర్ కాలేజిలో ఎంపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న నాగేశ్వరి అనే విద్యార్థిని శుక్రవారం రాత్రి హాస్టల్ రూమ్ లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మఅతికి కాలేజి యాజమాన్యమే కారణం అంటూ కాలేజి వద్ద శనివారం నాగేశ్వరి తల్లి తండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ తమ అమ్మాయి మృతి చెందిన విషయం కూడా తమకు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదంటే దీని వెనుక ఏదో జరిగిందని, ఇంత జరిగినా కాలేజి ప్రిిన్సిపల్ ఇక్కడికి రాకుండా పరారీలో ఉన్నాడని ప్రిన్సిపల్ వచ్చి ఏం జరిగిందో సమాధానం చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ తల్లితండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. ఉద్వేగానికి లోనైన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కాలేజి ఫర్నీచర్ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.