ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈడీ కేసుల ఛార్జ్షీట్లో నిందితురాలిగా తన భార్య వైఎస్ భారతి పేరు ఉందంటూ కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భారతికి ఈ కేసులతో సంబంధం ఏంటి?. ఆమెను కూడా కోర్టులకు తిప్పాలని చూస్తున్నారా?. ఛార్జ్షీట్ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోకముందే పత్రికలకు ఎలా తెలిసింది.
అంతేకాకుండా జడ్జి పరిగణనలోకి తీసుకోకముందే ఛార్జ్షీట్లో ఏముందో ఎవరికైనా ఎలా తెలుస్తుంది. మాక్కూడా తెలియకుండా బయటివారికి ఎలా తెలిసింది. మాపై బురద జల్లుతున్నారు. నామీదే కాకుండా మొత్తం నా కుటుంబసభ్యులను కూడా టార్గెట్ చేస్తున్నారు. సీబీఐ విచారణలో లేని అంశాలు ఇన్నేళ్ల తర్వాత ఈడీ ఛార్జ్షీట్ లోకి ఎలా వచ్చాయి.
ఈడీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పనిచేసే ఇద్దరు అధికారులు ఉన్నారు. ఆ అధికారుల కాల్ డేటాను పరిశీలిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ వేధింపులపై ఇప్పటికే ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశాం. పగలు కాంగ్రెస్తో కాపురం...రాత్రి బీజేపీతో సంసారం చేయడం చంద్రబాబు నైజం. అన్ని అంశాలు ప్రజలకు తెలియాలనే బహిరంగ లేఖ రాస్తున్నా.’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.