ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అండర్సన్ ఖాతాలో అరుదైన రికార్డులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 11, 2018, 10:48 AM

ఇంగ్లాండ్‌ గడ్డ మీద టెస్టుల్లో భారత బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. జేమ్స్ అండర్సన్ చెలరేగడంతో టీమిండియా 107 పరుగులకే ఆలౌటయ్యింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట సాధ్యం కాకపోగా.. రెండో రోజు కూడా వరణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. 35.2 ఓవర్లలో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. వాతావరణంలో తేమ ఉండటం, పిచ్ స్వింగ్‌కు అనుకూలించడంతో ఇంగ్లాండ్ పేసర్లు హడలెత్తించారు. 


కోహ్లి (23), రహానే (18) భారత్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత్ ఓ దశలో 84 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (38 బంతుల్లో 29), షమీ (3 బంతుల్లో 10 నాటౌట్) దూకుడుగా ఆడటంతో టీమిండియా 100 పరుగుల మార్క్ దాటగలిగింది. 


అండర్సన్ 13.2 ఓవర్లలో 20 పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీయగా.. కర్రాన్, బ్రాడ్‌‌ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో చెలరేగిన అండర్సన్‌.. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఇమ్రాన్ ఖాన్ (94) పేరిట ఉండగా.. 95 వికెట్లతో అండర్సన్ దాన్ని అధిగమించాడు. సొంత గడ్డ మీద ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో అండర్సన్ రెండోస్థానానికి చేరుకున్నాడు. మురళీధరన్ ముత్తయ్య స్వదేశంలో 499 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అనిల్ కుంబ్లే 350 వికెట్లతో రెండోస్థానంలో ఉండగా.. అండర్సన్ జంబోను అధిగమించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com