అమరావతి:జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లిలో రైతులతో ఆయన భేటీ అయ్యారు. అక్కడి పంట పొలాలను పరిశీలించిన అనంతరం, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, తమ పొలాల్లోకి వెళ్లేందుకు కూడా ఆధార్ కార్డు చూపించాల్సి వస్తోందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సంవత్సరాలుగా నిద్రలేని రాత్రులను తాము గడుపుతున్నామని... ఏ క్షణాన భూములను లాక్కుంటారోనని భయపడుతున్నామని చెప్పారు. తమ భూముల్లో పంటలు పండటం లేదంటూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మరో రైతు తెలిపారు. ఆనాడు చెప్పుల్లేకుండా వచ్చి, మా ఓట్లను అడిగిన చంద్రబాబు... ఇప్పుడు మమ్మల్ని గెంటేస్తున్నారని చెప్పారు. ఉండవల్లిలో కార్యక్రమం తర్వాత పవన్ పెనుమాకకు వెళతారు.