ప్రస్తుత ప్రభుత్వ గారడీలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని రాహుల్ గాంధీ అన్నారు. అవిశ్వాసంపై రాహుల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయిలు వేస్తామని చెప్పారని అది గారడీ నెంబర్ వన్ అని అన్నారు. రెండు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలిస్తామని చెప్పారని అది గారడీ నెంబర్ టూ అని రాహుల్ అన్నారు. రక్షణ మంత్రి దేశానికి అబద్ధం చెప్పారని కాంగ్రెస్ అధినేత రాహుల్ అన్నారు. ప్రధాని ఒత్తిడి వల్లనే ఆమె దేశానికి అబద్ధం చేప్పారని ఆయన ఆరోపించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై ఆయన ప్రసంగిస్తున్నారు. తాను దేశానికి ప్రధానిని కాననీ, కాపలాదారుడిననీ రాహుల్ అన్నారు. ఫ్రాన్- భారత్ ల మధ్య రహస్య ఒప్పందం ఏమీ లేదని ఆ దేశాధ్యక్షుడు తనతో స్వయంగా చెప్పారన్నారు.
ఈ విషయంలో నిర్మలా సీతారామన్ అబద్ధం చెప్పి దేశాన్ని తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఈ దశలో నిర్మలా సీతారామన్ అభ్యంతరం చెప్పారు. ఈ విషయాలన్నీ వాస్తవాలన్న రాహుల్ ప్రధాని సభకు సమాధానం చెప్పాలన్నారు. తానీ విషయాలన్నీ ప్రస్తావిస్తుంటే ప్రధాని నవ్వుతున్నారనీ, కానీ ఆయన కళ్లల్లో బెరుకు కనిపిస్తున్నదని రాహుల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశానికి తాను కాపలాదారుడినని చెప్పుకున్నారని, కానీ ఆయన కాపలాదారుడు కాదని, పలాయనవాది అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బడా కంపెనీలతో ప్రధాని కుమ్మక్కవుతారన్నది జగద్విదితమని ఆయన అన్నారు.