న్యూఢిల్లీ : ఫైనాన్స్ కమిషన్ ను అడ్డు పెట్టుకునిఏపీకి ప్రత్యేక హోదా నిరాకరించడం ద్రోహమని గల్లా జయదేవ్ విమర్శించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ విభజన హామీల విషయంలో ఏపీ ప్రజలకు ద్రోహం చేశారన్నారు. ఆర్టికల్ 4 ప్రకారం పార్లమెంట్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చని అన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదని ఆర్థిక సంఘం అధికారులే చెప్పారని గల్లా జయదేవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదని అన్నారు.
నేడు ప్రధానిగా మీరిచ్చిన హామీలు రేపు నెరవేరే అవకాశం ఉంటుందని ఎలా భావించగలమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలో అవినీతిని రూపుమాపుతామంటూ అధికారంలోనికి వచ్చారనీ, కానీ అందుకు భిన్నంగా ఎన్నో కేసులలో ఎ1 ముద్దాయిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి అండగా నిలుస్తున్నారని జయదేవ్ ఆరోపించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన అనుచరులకు బీజేపీ టికెట్లు ఇచ్చిందని, పలు కేసుల నుంచి గాలి విముక్తి లభించిందని విమర్శించారు.