కోల్కతా : పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్లో ఏర్పాటు చేసిన కృషి వికాస్ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా టెంట్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లిన మోదీ.. వారిని పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. టెంట్ కుప్పకూలడంతో.. సభకు వచ్చిన జనాలందరూ భయంతో పరుగులు తీశారు. టెంట్ కుప్పకూలిన ఘటనలో 20 మంది గాయపడటంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మమత పేర్కొన్నారు. గాయపడ్డ వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.