అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు డివిలియర్స్. మళ్లీ అంతే ఆశ్చర్యకరమైన వార్త చెప్పాడు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్. ఏబీ డివిలియర్స్. ఫుల్ఫామ్లో ఉన్న డివిలియర్స్ ఇదే జోరు కొనసాగిస్తే 2019 ప్రపంచకప్ కచ్చితంగా దక్షిణాఫ్రికాదే అనుకున్నారంతా. కానీ అనూహ్యాంగా ఈ మిస్టర్ 360.. 'బాగా అలిసిపోయాను.. ఫామ్లో ఉన్నప్పుడే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నానంటూ' ఓ వీడియో ద్వారా రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు ఊహించని విధంగా షాక్ ఇచ్చాడు.
తాజాగా తెలిసిన వివరాల ప్రకారం.. రిటర్మైంట్ ప్రకటించిన సమయంలో ఏబీ మాట్లాడుతూ.. విదేశాల్లో నిర్వహించే లీగ్ల్లో ఆడాలనే ఆలోచన లేదని, దేశవాళీ క్రికెట్లో టైటాన్స్ జట్టుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. అయితే స్వదేశంలో టీ20 లీగ్లో టైటాన్స్ తరఫున కొనసాగతానని చెప్పి.. ఐపీఎల్ గురించి సంచలన వార్త ప్రకటించాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ టోర్నీలో డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.తాజాగా న్యూస్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న డివిలియర్స్ మరికొంత కాలం ఐపీఎల్ ఆడాలనుకుంటున్నట్లు చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ‘ఐపీఎల్లో కొన్నేళ్ల పాటు ఆడాలనుకుంటున్నా. మరోవైపు టైటాన్స్కు కూడా ఆడుతూ యువ ఆటగాళ్లకు తోడ్పాటునందించాలని నిర్ణయించుకున్నా. అయితే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై ఎలాంటి ప్రణాళికలు లేవు. వీటిలోనూ ఎక్కువకాలం కొనసాగుతానని మాత్రం చెప్పలేనంటూ' డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.