విజయవాడ: విజయవాడ నగరంలో నకిలీ పోలీసుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం రాత్రి పోలీసుల పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.60 వేలు దోచుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. కృష్ణలంకకు చెందిన సోమచంద్ర దత్ భవానీపురం పీఎస్ పరిధిలో ఫౌండ్రి నిర్వహిస్తున్నాడు. రాత్రి 11గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరాడు. హెడ్వాటర్ ట్యాంక్ వద్ద ఇద్దరు వ్యక్తులు సోమచంద్రను ఆపి తాము పోలీసులమని చెప్పి తనిఖీ చేశారు. అతడి వద్ద రూ.60 వేల నగదు తీసుకుని పరారయ్యారు. దీంతో వారు దొంగలని అనుమానం వచ్చి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల పేరుతో వరుసగా నేరాలకు పాల్పడుతున్న కేడీలను వెంటనే పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు. నిజంగా ఇది నకిలీ పోలీసుల పనేనా? దారి తప్పిన పోలీసులే ఇలా వసూళ్లకు పాల్పడుతున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.