అమరావతి : నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకూ కీలకమని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు, విధివిధానాలు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయని ఆయన ఈ రోజిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకోవడానికి రాష్ట్రాలు సమైక్యంగా గళమెత్తాల్సిన అవసరం ఉందని యనమల అభిప్రాయపడ్డారు. బీజేపీ యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బట్టి ఉంటుందని యనమల చెప్పారు. టిడిపికి వ్యతిరేకంగా ఢిల్లిలో కుట్ర జరుగుతోందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అందుకే వైకాపా నేతలు ఢిల్లి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని ఆయన అన్నారు. రైతుల జీవనానికి ముడివడి ఉన్న పోలవరాన్ని వైకాపా నేతలు సినిమాతో పోల్చడాన్ని ఆయన ఖండించారు. రాజధానిని, పోలవరాన్ని సినిమాతో పోల్చడం వైకాపా అధినేత అజ్ఞానానికి చిహ్నమని ఆయన అన్నారు.