అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉంటే పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయి ఉండేదని వైకాపా నేత మేకపాటి రాజమోహన్ అన్నారు. వైఎస్ హయాంలో 39 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. తన హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్రం ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని మేకపాటి అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 44,500 కోట్ల రూపాయిలు కావాలని ఆయన చెప్పారు. ప్రజలపై భారం పడకుండా చూడాలని ఆయన అన్నారు.