లక్నో : 2019 జాతీయ ఎన్నికలలో తమ కూటమి బిజెపిని ఓడించడానికి పోరాటం చేస్తుందని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. తమ కూటమి కొనసాగుతుందని, కొన్ని సీట్లను ఇవ్వాల్సి వస్తే తాము అందుకు కూడా సిద్ధమేనని, బిజెపిని ఓడించడానికి తాము పోరాటం చేస్తామని అఖిలేష్ అన్నారు. గత నెల జరిగిన ఉప ఎన్నికలలో బిజెపిని ఓడించి కైరానా నియోజకవర్గం సీటును ఈ కూటమి భారీ మెజారిటీతో దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇదే విజయాన్ని 2019 ఎన్నికలలో సాధించాలని మాయావతి(బిఎస్పి), అఖిలేష్ యాదవ్ (ఎస్పి) కూటమి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ కూటమిపై బిజెపి నేత, మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారు. వారి కూటమి అంశాల ప్రాతిపదికన కాదని, త్వరలోనే వారు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటారని ఆయన పేర్కొన్నారు. దీంతో అఖిలేష్ స్పందిస్తూ తమ కూటమి 2019లో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.