2017వ సంవత్సరంలో ఐసీసీ టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గానిస్థాన్కు తొలి మ్యాచ్లోనే ఆటంకం ఎదురుకానుంది. జూన్ 14వ తేదీన జరిగే ఏకైక చారిత్రాత్మక టెస్టుకు బెంగళూరు వేదిక కానుంది. ఈ క్రమంలో అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి మ్యాచ్ జరిగే రోజుల్లో వర్షం వచ్చే సూచనలున్నాయంటూ.. నిపుణులు భావిస్తున్నారు.ఇప్పటికే బెంగళూరు చేరుకున్న అఫ్గాన్ జట్టు ఆదివారం ప్రాక్టీస్లో కూడా పాల్గొంది. గత వారం బంగ్లాదేశ్తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్న అఫ్గాన్ అదే స్ఫూర్తిని భారత్తో జరిగే చరిత్రాత్మక టెస్టులోనూ కొనసాగించాలని చూస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్ణాటకలో వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల భారీ వర్షం పడటంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవు కూడా ప్రకటించారు.
శుక్ర, శనివారాల్లోనూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో భారత్-అఫ్గాన్ మధ్య గురువారం ప్రారంభమయ్యే మ్యాచ్కు రెండు రోజులు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఇది కాస్త ఊరట కలిగించే విషయమైనప్పటికీ ఏం జరుగుతుందో చూడాలి మరి.
భారత్తో ఏకైక టెస్టు కోసం శనివారమే అఫ్గాన్ ఆటగాళ్లు బెంగళూరు చేరుకున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్కు హాజరయ్యారు. కోచ్ ఆధ్వర్యంలో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో వారంతా ప్రాక్టీస్ నిర్వహించారు.