హైదరాబాద్: ఐఐటీ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారు. జాతీయ స్థాయిలో మొదటి పది ర్యాంకుల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఎస్టీ కేటగిరీలో అగ్రస్థానం దక్కింది. తొలి వంద ర్యాంకుల్లో సుమారు పాతిక మందికి పైగా విద్యార్థులు ఏపీ, తెలంగాణ నుంచే ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానాలోని పంచకులకు చెందిన ప్రణవ్ గోయల్ 337 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా.... అమ్మాయిల విభాగంలో దిల్లీకి చెందిన మీనల్ పరఖ్ 318 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మావూరి శివకృష్ణ మనోహర్ జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో ఐదో ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచాడు. శ్రీకాకుళం జిల్లాకే చెందిన కేవీఆర్ హేమంత్ కుమార్ ఏడో ర్యాంకు సాధించాడు. ఎస్టీ కేటగిరీలో హైదరాబాద్ విద్యార్థి జాటోత్ శివతరుణ్ దేశంలో మొదటి స్థానంలో నిలిచాడు. హైదరాబాద్కే చెందిన శశాంక్ అచ్యుత్కి 62వ ర్యాంకు దక్కింది. ఐఐటీ చెన్నై రీజియన్లో మావూరి శివ కృష్ణ మనోహర్, గోసుల వినాయక శ్రీవర్దన్, అయ్యపు వెంకటఫణి వంశీనాథ్, బసవరాజు జిష్ణు, మేకల అన్మోల్ రెడ్డి మొదటి ఐదు ర్యాంకులను సాధించారు.
జేఈఈ అడ్వాన్సుడ్ ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లో 11,279 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్సుడ్ 1,55, 158 మంది విద్యార్థులు రాయగా... 18,318 మంది కౌన్సెలింగ్కు అర్హత సాధించారు. వారిలో అమ్మాయిలు 2076 కాగా.. అబ్బాయిలు 16వేల 62 మంది ఉన్నారు. గతేడాది సుమారు యాభై వేల మంది అర్హత సాధించగా.. ఈసారి భారీగా తగ్గింది. ఓపెన్ కేటగిరీలో 126 మార్కులు కటాఫ్గా నిర్ణయించారు. ఓబీసీలో 114, ఎస్సీ, ఎస్టీలకు 63 మార్కులు అర్హతగా నిర్ణయించారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీఐల్లో ప్రవేశాల కోసం ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కానుంది.