ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా పోరాట యాత్రకు విరామం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 10, 2018, 04:11 PM

విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్రకు కొద్దిరోజులు విరామం ప్రకటించారు. తన వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువమంది ముస్లింలు ఉండటంతో పవన్ రంజాన్‌ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. తిరిగి పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర రంజాన్‌ అనంతరం విశాఖ జిల్లాలో యథావిధిగా కొనసాగనుంది. శుక్రవారం రాత్రి ఎలమంచిలి సభను ముగించుకుని విశాఖపట్నం చేరుకున్న పవన్‌ భీమిలి బీచ్‌రోడ్డులోని సాయిప్రియ రిసార్ట్‌లో బస చేశారు. శనివారం విశాఖకు చెందిన కొంతమంది మేధావులతో ఆయన సమావేశమయ్యారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణాలు-పరిష్కారాలు అనే అంశమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం సాగింది. మాజీ వైస్‌ చాన్సలర్‌ కేఎస్‌ చలం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం సైతం ఇదే అంశంపై చర్చలు జరగనున్నట్లు జనసేన మీడియా హెడ్‌ పి.హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ఆది, సోమవారాలలో వివిధ వర్గాలవారితో పవన్‌ చర్చించనున్నారంటూ హరిప్రసాద్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తద్వారా జనసేన కార్యకర్తలకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై అవగాహన కల్పించేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేయడం కూడా జరుగుతోందని ఆ ప్రకటనలో హరిప్రసాద్ వివరించారు. ఆదివారం,సోమవారం సమావేశాలు ముగిసిన అనంతరం సోమవారం సాయంత్రం పవన్‌ కళ్యాణ్ విశాఖ నుంచి తిరిగి హైదరాబాద్‌ బయలుదేరివెళ్లనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com