ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన డీఎస్సీ రాత పరీక్షలు ఆగస్టులో నిర్వహిస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. శనివారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ... డీఎస్సీకి సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్ ఖరారైందంటూ ఆ వివరాలు వెల్లడించారు. వచ్చే నెల ఆరో తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ దఫా 10,351 పోస్టులు భర్తీ చేస్తామని, వీటి నియామకానికి ఆర్థికశాఖ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణను ఈ సారి ఏపీపీఎస్సీ చేపడుతుందని చెప్పారు.
షెడ్యూల్
జూలై ఆరు నుంచి ఆగస్టు ఎనిమిదో తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లించాలి. జూలై ఏడో తేదీ నుంచి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 15 నుంచి హాల్టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. 24, 25, 26 తేదీల్లో రాతపరీక్షలు ఉంటాయి. ఆగస్టు 27న ప్రాథమిక కీ విడుదల చేసి, ఆ రోజు నుంచి సెప్టెంబరు ఏడో తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబరు 10న తుది కీ, 15న ఫలితాలు విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,061, లాంగ్వేజ్ పండిట్లు 251, పీఈటీలు 24, ఎస్జీటీలు 2,290, మునిసిపల్ పోస్టులు 1,448, మోడల్ స్కూల్ టీచర్లు 929, సంగీతం 58, కొత్తగా ఏర్పాటుచేసినవి 3,290 పోస్టులు భర్తీ చేయనున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2014లో పదివేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దీనిలో భాగంగానే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, వర్చువల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం లేదన్నారు. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం నాటికి 90శాతం పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామన్నారు. మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు.