కౌలాలంపూర్: ఏడోసారి ట్రోఫీ సొంతం చేసుకోవాలన్న భారత్ అమ్మాయిల ఆశలకు తెరపడింది. ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్ అమ్మాయిల చేతిలో భారత్ పరాజయం పాలైంది. లీగ్ దశలో కూడా భారత్ బంగ్లా చేతిలోనే ఓడింది. భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి బంతి వరకు పట్టు వదలకుండా పోరాడిన బంగ్లా 3 వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. తొలిసారి ఆసియా కప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. బంగ్లా బ్యాట్స్వుమెన్ తలో చేయి వేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్లో హర్మన్ప్రీత్ కౌర్(56: 42 బంతుల్లో 7ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో 9 వికెట్లకు 112 పరుగులు చేసింది.
బంగ్లా బ్యాట్స్వుమన్ సుల్తానా(27), రుమానా అహ్మద్(23), షమీమా సుల్తానా(16), ఆయాషా రహ్మన్(17) పెద్దగా రాణించనప్పటికీ లక్ష్యం తక్కువ కావడంతో సునాయాసంగా విజయం సాధించింది. భారత్ బౌలర్లలో శికా పాండే, దీప్తి శర్మ, జులన్ గోస్వామి తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత అమ్మాయిలకు ఆరంభం నుంచే బంగ్లా బౌలర్ల నుంచి ప్రతిఘటన ఎదురైంది. జట్టు స్కోరు 12 వద్ద ఓపెనర్ స్మృతి మంధాన(7) రనౌట్తో భారత్ పతనం మొదలైంది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(4), మిథాలీ రాజ్(11) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ బాట పట్టడంతో భారత్పై ఒత్తిడి పెరిగింది. ఒకానొక దశలో భారత్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కూడా కలిగింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హర్మన్ప్రీత్ కౌర్ పట్టువదల్లేదు. బంగ్లా బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టింది. ఒంటిచేత్తో పోరాడుతున్న కౌర్కు మిగతా బ్యాట్స్వుమన్ సహకారం అందించలేకపోయారు. కనీసం వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేయలేక వెనుదిరిగారు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న కౌర్ జట్టు స్కోరును 100 పరుగుల మార్క్ను దాటించింది. బంగ్లా బౌలర్లలో తుల్ కుబ్రా(2/23), రుమానా అహ్మద్(2/22) గొప్పగా రాణించారు. సల్మా ఖాటన్, జమానార ఆలం తలో వికెట్ పడగొట్టారు.