ప్రొద్దుటూరు, న్యూస్టుడే: తెదేపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైకాపాతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని కడప జిల్లా పార్టీలో ముఠాలు ప్రోత్సహిస్తున్నారని అదేపార్టీకి చెందిన ప్రొద్దుటూరు నియోజకవర్గ బాధ్యుడు, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. శనివారమిక్కడ పురపాలిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడూ.. ఎంపీ సీఎం రమేష్ వైఖరి వల్ల జిల్లాలో తెదేపా నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చిన రాజ్యసభ పదవిని అనుభవిస్తూ జిల్లా పార్టీలో గొడవలు సృష్టించటమేమిటని ప్రశ్నించారు. సీఎం రమేష్ పంచాయతీ బోర్డుకు ఎక్కువ... మండలానికి తక్కువ అని ఎద్దేవా చేశారు. నేరుగా ఎన్నికల్లో పాల్గొని గెలిచే సత్తా ఉందా అంటూ ప్రశ్నించారు. బద్వేలు, కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, కమలాపురం, రైల్వే కోడూరు నియోజకవర్గ పార్టీలో ముఠాలను ఏర్పాటు చేసి తెదేపాలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు ఆగిపోతే.. వై.ఎస్. హయాంలో జగన్కు ముడుపులిచ్చి రమేష్ బిల్లులు చేయించుకున్నారని పేర్కొన్నారు. కుందూ పెన్నా కాల్వ విషయంలో తనకు 5 శాతం కమీషన్లు ఇవ్వాలని సీఎం రమేష్ డిమాండు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బ్యాంకుల్లో తప్పుడు తనఖా పత్రాలు పెట్టి కోట్లాది రూపాయలు తెచ్చుకున్న విషయం అందరికీ తెలుసన్నారు. గ్రూపు రాజకీయాలతో పార్టీని దెబ్బతీస్తున్న రమేష్పై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తీర్మానం..పార్టీ వ్యతిరేకం: ప్రొద్దుటూరు పురపాలిక పార్కులో నీళ్ల ట్యాంకు నిర్మాణానికి మూడు నెలల క్రితమే కమిషనర్ పబ్లిక్ హెల్త్శాఖకు లిఖిత పూర్వక ఉత్తర్వులిచ్చారని.. దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేయించడంలో సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారని వరదరాజులరెడ్డి ఆరోపించారు. వైకాపాకు చెందిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఈ ట్యాంకు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారని దీనికి సీఎం రమేష్ వర్గం మద్దతు పలకటమేంటని వరద ప్రశ్నించారు.