చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని అనుకుంటున్నట్లు ఆ జట్టు ఆటగాడు సురేశ్ రైనా తెలిపాడు. ఈ ఏడాది క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ హైదరాబాద్పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి చెన్నై సూపర్కింగ్స్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. ఐపీఎల్లో చెన్నై ఫైనల్ చేరడం ఇది ఏడోసారి. కాగా ధోనీ ఫైనల్ ఆడటం ఇది ఎనిమిదోసారి. గత ఏడాది రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహించిన ధోనీ ముంబయి ఇండియన్స్తో జరిగిన ఫైనల్లో ఆడిన సంగతి తెలిసిందే.
రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి ఐపీఎల్ ఆడుతోన్న చెన్నై ఫైనల్లో అడుగుపెట్టడంపై రైనా మాట్లాడుతూ...‘క్వాలిఫయర్-1లో సన్రైజర్స్పై విజయం సాధించి చెన్నై ఫైనల్లో అడుగుపెట్టింది. చెన్నై ఫైనల్ చేరిందని తెలియగానే ధోనీ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. చెన్నై జట్టును ధోనీ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. 2008 నుంచి చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తోన్న ధోనీ జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఎంతో మంచి వ్యక్తి. ఈ ఏడాది మా జట్టు ఆటగాళ్లమంతా ఒకటే అనుకున్నాం. ఎలాగైనా ధోనీ కోసం ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని నిశ్చయించుకున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో’ అని రైనా వివరించాడు.
ఈ ఏడాది జనవరి చివరి వారంలో వేలం ముగిసిన అనంతరం ఓ పత్రికలో ఒక వార్త చదివాను. చెన్నై సూపర్కింగ్స్ జట్టులో అంతా 30ఏళ్లకు పైబడిన వారే ఎక్కువ ఉన్నారు అని. అలా రాసిన వారికి ఇప్పుడు అర్థమై ఉంటుంది. జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉంటే ఎంత విజయవంతం అవుతామో వారికి తెలిసి వచ్చి ఉంటుంది. మా జట్టులో ఎంతో మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఈ సీజన్లో మా జట్టు ఆటగాళ్లు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మేమేంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. షేన్వాట్సన్-రాయుడు ఎంతో మంచి ఓపెనింగ్ ఇచ్చారు. 2011 తర్వాత మా జట్టు టైటిల్ గెలవలేదు. ఈ ఏడాది మేము టైటిల్ గెలవాలనుకుంటున్నాం’ అని రైనా తెలిపాడు.
ఆదివారం ముంబయిలోని వాంఖడే మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్కింగ్స్ మధ్య ఐపీఎల్ ఫైనల్ పోటీ జరగనుంది.