అమరావతి: భారతీయ సంస్కారాన్ని కూడా తప్పుపట్టడం బీజేపీ, వైసీపీ సంస్కృతి అని ఆర్థిక మంత్రి యనమల విమర్శించారు. బీజేపీ, వైసీపీ నేతలపై ఆర్థిక మంత్రి యనమల ధ్వజమెత్తారు. ఈమేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. శాసనసభలో జాతీయ గీతం వస్తుంటే సభ నుంచి వెళ్లిపోవడం యడ్యూరప్ప సంస్కృతి అని పేర్కొన్నారు. కేసుల మాఫీ కోసం కేంద్రంలో పెద్దల కాళ్లు పట్టుకోవడం జగన్ సంస్కృతి అన్నారు. ఢిల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లలేదన్నారు. 2019లో బీజేపీతో పొత్తు కోసమే జగన్ బెంగళూరు ప్రమాణానికి వెళ్లలేదని విమర్శించారు. కర్ణాటకలో గాలి జనార్ధన్రెడ్డి, ఏపీలో జగన్తో బీజేపీ వెళ్తోందన్నారు. 2019 ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు. కేంద్రంలో రాబోయేది బీజేపీయేతర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. చంద్రబాబును ప్రజలకు దూరం చేయాలనేదే బీజేపీ, వైసీపీ కుట్రలు పన్నుతున్నాయన్నారు.