విశాఖ: టీడీపీ ధర్మపోరాట సభ జరిగిన ప్రాంతాన్ని శుద్ధి చేసేందుకు వైసీపీ కార్యాలయం నుంచి నేతలు ర్యాలీగా బయల్దేరారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలకు ర్యాలీగా బయల్దేరిన ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా హైవేపై ఎంపీ విజయసాయిరెడ్డి బైఠాయించారు. వైసీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో విజయసాయిరెడ్డి సహా వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. తిరుమల శ్రీవారి సొమ్మును ఏపీ సీఎం చంద్రబాబు దొచుకున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఆ సొమ్మును హైదరాబాద్, అమరావతి లలోని తన నివాసాలలో భద్రపరిచారని పేర్కొన్నారు. ఆయనిక్కడ మాట్లాడుతూ 12 గంటలలో సీబీఐ చేత కానీ, తెలంగాణ పోలీసుల చేత కానీ సోదాలు చేయిస్తే ఆ సొమ్ము లభ్యమౌతుందన్నారు. ఆలస్యం చేస్తే దానిని చంద్రబాబు విదేశాలకు తరలించే అవకాశం ఉందన్నారు. ఒక వేళ సోదాలలో ఏమీ బయటపడకపోతే 13వ గంటలో తాను రాజీనామా చేస్తానని విజయ సాయి రెడ్డి అన్నారు.