మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ కాల్పుల్లో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి ధైర్యం అందించారు. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ తూత్తుకుడి ఘటనని ఖండిస్తూ, మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూగర్భ జలాలు కలుషితమవడానికి కారణమవుతున్న తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ గత 100 రోజులుగా అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి వారు పూనుకున్నారు. ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో, తమిళనాడు అట్టుడుకుతోంది. దీనిపై పలువురు తమిళ సినీ పరిశమ్రకి చెందిన సినీ నటులు కూడా స్పందిస్తున్నారు.