న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ ప్రాంతీయ పార్టీలకు అందిన నిధుల గురించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ ఓ రిపోర్ట్ ఇచ్చింది. 2016-17 సంవత్సరానికి 32 ప్రాంతీయ పార్టీలకు సుమారు 321.03 కోట్లు అందినట్లు ఆ నివేదిక పేర్కొన్నది. అంతేకాదు ఆ పార్టీల ఖర్చు సుమారు రూ.435.48 కోట్లు ఉందని రిపోర్ట్ వెల్లడించింది. అత్యతధికంగా సమాజ్వాదీ పార్టీకి 82.76 కోట్లు అందాయి. ఇదెంతంటే ప్రాంతీయ పార్టీల్లో 26 శాతం ఉంటుందని రిపోర్ట్ తెలిపింది. రెండవ స్థానంలో తెలుగుదేశం పార్టీ నిలిచింది. ఆ పార్టీకి 72.92 కోట్లు వచ్చాయి. అన్నాడీఎంకేకు 48.88 కోట్ల నిధులు అందాయి. మరో 16 పార్టీలకు చెందిన ఆడిట్ రిపోర్ట్ మాత్రం ఇంకా అందలేదు. ఆ జాబితాలో ఆమ్ఆద్మీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్జేడీలు ఉన్నాయి. మొత్తం 32 ప్రాంతీయ పార్టీల్లో 17 పార్టీలు మాత్రం ఇంకా 114 కోట్లు ఖర్చు చేయలేదని పేర్కొన్నాయి. ఎంఐఎం, జనతాదళ్ పార్టీలు తమ ఫండ్లో సుమారు 87 శాతం నిధులను ఖర్చు చేయలేదు.