ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమలకు వచ్చిన సందర్భంలో వకుళమాత పోటులో నిధుల కోసం ప్రభుత్వం తవ్వకాలు జరిపించిందని చెబుతూ, ఆ ప్రాంతాన్ని, వంటశాలలో చేసిన మార్పులను గురించి వెల్లడించినందునే, తనపై కక్షకట్టి ప్రతీకారం తీర్చుకున్నారని శ్రీవారి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు. పోటులో తవ్వకాలను అమిత్ షాకు చూపించినందుకు తాను బాధితుడిని అయ్యానని అన్నారు. అమిత్ షా వచ్చిన రోజు తానే ఆహ్వానించి, స్వామి దర్శనం చేయించానని, ఆపై ఆయన వంటగది సమీపానికి రాగానే, లోనికి తీసుకెళ్లి, వెయ్యేళ్లుగా ఎన్నడూ మూసివేయని గదిని డిసెంబర్ 8న మూసివేసిన విషయాన్ని వెల్లడించానని, స్వామి నైవేద్యాలను ఎన్నడూ మొదటి ప్రాకారానికి ఆవల చేయలేదని, తప్పు జరిగిందని ఫిర్యాదు చేశానని చెప్పారు. వంటగదిలో ఏం జరిగిందని తాను ఈఓను అడిగితే, ఆయన సైతం తనకేమీ తెలియదని బదులిచ్చారని, ఆలయంలో శాస్త్ర విరుద్ధమైన పనులు జరుగుతున్నాయని ఆరోపించారు.