తిరుమలలో కొన్ని మరమ్మతులపై భక్తులకు అనుమానాలున్నాయని టీటీడీ ఈవో అశోక్ సింఘాల్ అన్నారు. అర్చకుల వివాదంపై టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి పూజా కైంకర్యాలు, పూజలు శాస్త్రోక్తంగా, ఆగమోక్తమంగా జరుగుతున్నాయన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి నేటి వరకు భక్తులు సమర్పిస్తున్న నగలన్నీ భద్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే సమావేశం ఏర్పాటు చేశామన్నారు. 2012లోనే అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి విధానం అమల్లోకి వచ్చిందని, కానీ పదవీ విరమణ తర్వాత కొందరు అర్చకులు హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు. నిబంధనల ప్రకారం అర్చకులను తొలగించిన స్థానంలో వారి కుటుంబీకులనే అర్చకులుగా నియమించామని పేర్కొన్నారు. ప్రధాన అర్చకులుగా తమకు అవకాశం కల్పించాలని గొల్లపల్లి కుటుంబానికి చెందిన వేణుగోపాల దీక్షితులు కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. మీరాశి వంశీకులకు, బ్రాహ్మణులకు ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు.