యెడ్యూరప్ప 24 గంటలలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్నాటక గవర్నర్ వజుభాయ్ వాలా న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. అసెంబ్లీ అత్వవసర సమావేశానికి నోటిఫికేషన్ జారీకి కసరత్తు ప్రారంభించారు. నిన్న కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యెడ్యూరప్పకు సభ విశ్వాసాన్ని పొందేందుకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు మేరకు 24 గంటలలోనే బలనిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవ్వడంతో తీసుకోవలసిన చర్యలపై గవర్నర్ వజుభాయ్ వాలా న్యాయనిపుణులతో భేటీ అయ్యారు.