ఢిల్లీ: రేపు సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. రేపు ఎట్టిపరిస్థితుల్లోనూ బలపరీక్ష పూర్తిచేయాల్సిందేనని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ బీజేపీని ఆహ్వానించడంపై కాంగ్రెస్-జేడీఎస్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం అర్థరాత్రి అత్యవసరంగా పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే విధించలేమని పేర్కొంటూ తదుపరి విచారణను నేటి వాయిదా వేసింది. నేటి విచారణ సందర్భంగా కాంగ్రెస్ తరపున అభిషేక్ సింఘ్వీ, బీజేపీ తరపున ముకుల్ రోహత్గీ, కేంద్రప్రభుత్వం తరపున వేణుగోపాల్ వాదనలు వినిపించారు. అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. కాంగ్రెస్-జేడీఎస్ల కూటమికి 116 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉందన్నారు. అవకాశం ఇస్తే రేపే అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని విన్నవించారు. బీజేపీకి మెజారిటీ లేదన్నారు. ముకుల్ రోహత్గీ, కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. బలనిరూపణకు వారం రోజులు గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. సిక్రెట్ బ్యాలెట్ ద్వారా బలపరీక్ష జరపాల్సిందిగా సూచించారు. బలపరీక్షకు సమయం కావాలన్న బీజేపీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో యడ్యూరప్ప రేపు బలపరీక్షను ఎదుర్కోనున్నారు. సుప్రీం నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది.