అమరావతి: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మంటూరు.. పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లి మధ్య గోదావరి నదిలో నిన్న సాయంత్రం పెనుగాలులకు లాంచీ అదుపుతప్పి నీటమునిగిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో లాంచీలో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 22 మంది సురక్షితంగా బయటపడగా 22 మంది నదిలో మునిగి చనిపోయారు. లాంచీతో పాటు 12 మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. మరో 10 మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తక్షణ సాయం కింద రూ. లక్ష అందజేస్తున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాల్లో చదువుకున్న వారికి ఉపాధి అవకాశంతో పాటు వారి పిల్లలకు ఉచిత విద్య, ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రమాదానికి కారణాలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేవిపట్నానికి రహదారి సహా కనీస సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామంలో ఆర్ అండ్ ఆర్ కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.