తిరుపతి: భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శెట్టిపల్లెలో పర్యటించిన పవన్ కల్యాణ్ గ్రామస్థులు, రైతులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ అమరావతి నుంచి శెట్టిపల్లె భూముల వరకు గట్టుకో న్యాయం.. చెట్టుకో న్యాయంలా చేస్తున్నారని విమర్శించారు. రైతులకు అండగా లేని ప్రభుత్వాలు ఎందుకు? అని ప్రశ్నించారు. దోపిడీ జరుగుతుంటే మౌనంగా కూర్చునే రోజులు పోయాయన్నారు. కోట్ల రుణాలు ఎగ్గొట్టే వారికి బ్యాంకులు అండగా ఉంటూ రైతులకు అన్యాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీని గెలిపించామన్నారు. టీడీపీ తీరును చూస్తుంటే బిందెడు ఆశ చూపి మూడు చుక్కల నీరు పోసినట్టుగా ఉందన్నారు. పైడిపల్లె గ్రామానికి న్యాయం చేసి… శెట్టిపల్లెకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో విజయనగరం, శ్రీకాళహస్తిలో రోడ్డు విస్తరణ పరిహారం చెల్లించారని, ఇక్కడ ఎందుకు చెల్లించరు? అని ప్రశ్నించారు. మీకు అనుకూలంగా ఉండి ఓట్లు వేస్తేనే న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. వేల కోట్లు దోచుకునే తెలివితేటలు మీకు ఉన్నప్పుడు 600 ఎకరాల్ని కాపాడే తెలివి తేటలు ఎందుకు లేవు? అని ప్రశ్నించారు. శెట్టిపల్లె భూములు ఇవ్వడానికి జనసేన అంగీకరించదన్నారు.