ఏలూరు: పడవ ప్రమాదాలకు సీఎం, మంత్రులు బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్ పడవ ప్రమాద ఘటనపై స్పందించారు. వరుస పడవ ప్రమాదాలు ప్రభుత్వ హత్యలేనన్నారు. రాష్ట్రంలో పడవలు, లాంచీలకు భద్రత కరువైందన్నారు. నదులపై భద్రత లేని పడవలు, లాంచీలు యధేచ్ఛగా తిరుగుతున్నాయని, చాలా పడవలు, లాంఛీలకు ఫిట్నెస్ లేదన్నారు. లాంచీ దుర్ఘటనపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.