పాతగుంటూరు దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులతో భేటీ అయ్యారు. పాతగుంటూరు దుర్ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్లో అధికారులతో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు. ఆడపిల్లల జోలికి వచ్చేవారిని ఉపేక్షించవద్దని అధికారులను ఆదేశించారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరిద్దరిని కఠినంగా శిక్షిస్తే మిగిలినవారికి బుద్ధి వస్తుందని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు రక్షగా ఉండాలన్న ప్రచారం విస్తృతంగా జరగాలన్నారు. అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అశాంతి, అభద్రత సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితురాలి కుటుంబానికి అధికారులు అండగా నిలవాలన్నారు.