ఏలూరు: గోదావరిలో నిన్న జరిగిన పడవ ప్రమాద ఘటన వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 120 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న జరిగిన పడవ ప్రమాదంలో 36 మంది గల్లంతు కాగా, 16 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిని వెలికి తీసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది లాంఛీ ఆచూకీని కనుగొన్నారు. గోదావరిలో 40 అడుగుల లోతులో మట్టిలో కూరుకుపోయి ఉన్నట్లు గుర్తించారు. 3 బోట్ల సాయంతో లాంచీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లాంచీ ఇసుకలో కూరుకుపోవడంతో ఈ ప్రక్రియ కష్టసాధ్యంగా మారింది. సహాయక చర్యలను కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. గోదావరి గట్టుపై బాధిత బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.