తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదంపై గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పడవ ప్రమాదంపై జిల్లా యంత్రాంగంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న గవర్నర్ నరసింహన్ తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.లాంచీ మునక ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు. తీవ్రమైన ఈదురుగాలులు వీచడంతో మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు.. పశ్చిమ గోదావరి జిల్లా కొండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరిలో రెండు కొండల మధ్య లాంచీ బోల్తా పడిన విషయం తెలిసిందే. లాంచీలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రమాదం నుంచి 16 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని.. మరో 36 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం 20కి పైగా పడవలతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భారీ క్రేన్ల సాయంతో నీట మునిగిన లాంచీని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన వారి బంధువులు గోదావరి గట్టుమీద కన్నీరుమున్నీరవుతున్నారు.