బెంగళూరు: కర్ణాటకలో భాజపా అధికారం చేపట్టడం ఖాయమని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప దీమా వ్యక్తం చేశారు. విధానసభ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఈరోజు ఆయన శివమొగ్గ జిల్లాలోని శికార్పూర్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో భాజపా 140-150 స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను 50వేల మెజార్టీతో విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17 ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని.. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని యడ్యూరప్ప తెలిపారు.