అమరావతి: లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ ఆడబిడ్డల జోలికి వెళ్తే ఉరిశిక్ష వేస్తారనే భయం రావాలన్నారు. ఆడబిడ్డకు రక్షగా కదులుదాం ర్యాలీను విజయవంతం చేయాలని, ఆడబిడ్డలలో భవిష్యత్తుపై భరోసా కల్పించాలన్నారు. పంట నష్టం అంచనాలు నాలుగు రోజుల్లో పూర్తిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అకాల వర్షాలకు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న దెబ్బతిన్నాయన్నారు. ఉద్యాన పంటల ద్వారా ఆదాయం 25 నుంచి 30 శాతం పెరగాలన్నారు. ఏడాదికి 10 లక్షల ఎకరాల్లో పండ్లతోటల సాగు పెరగాలని, ఉద్యాన పంటల విస్తీర్ణం కోటి ఎకరాలకు విస్తరించాలన్నారు. అన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం కావాలన్నారు. ప్రతి పథకం ఎంత పూర్తి చేశాం, ఇంకెంత చేయాలనేది విశ్లేషించుకోవాలన్నారు.