టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు నారా లోకేశ్, కళా వెంకట్రావులతో పాటు టీడీపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. ఆనం వివేకా కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆనం వివేకానందరెడ్డి మరణంతో మంచి నాయకుడిని కోల్పోయామని మంత్రి నారాయణ అన్నారు.నెల్లూరు ప్రజలకు ఆనం చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. ఆనం వివేకానందరెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు ఎంతో లోటని అన్నారు. ఆనం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనంద వివేకానందరెడ్డి మృతి పట్ల ఏపీ అసెంబ్లి స్పీకర్ కోడెల శివప్రసాద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆనం వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు స్పీకర్ సానుభూతి తెలిపారు.