కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో ద్వారపూడిలో పర్యటిస్తున్నారు. ద్వారపూడిలో చంద్రకాంతి పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అక్టోబర్ 2 నాటికి 27లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో నూటికి నూరు శాతం ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేశామన్నారు. వందశాతం ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు పని చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. ఎల్ఈడీ బల్బులతో విద్యుత్ ఆదా అవుతుందని, అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ బల్బులు అమర్చామన్నారు. నాలుగేళ్లలో వందశాతం ఓడీఎఫ్ సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రూ.4,500 కోట్లు ఖర్చు పెట్టి మరుగుదొడ్లు నిర్మించామన్నారు. నాలుగేళ్లలో 18వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించామని, ఈ ఏడాది 10వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. ఏడాదిలోగా అన్ని ఊళ్లలో చెత్త సేకరణ కార్యక్రమం చేపడతామని, పశువుల పేడను సేకరించి ఎరువుగా మార్చి ఇస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తామన్నారు. క్యూఆర్ కోడ్తో డోర్ నెంబర్ల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటకుంటలు తవ్వామన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తున్నామని పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో ముందుకెళ్తున్నామన్నారు.