ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరించేందుకే సైకిల్ ర్యాలీలు చేపడుతున్నామని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు.. వైకాపాను అడ్డం పెట్టుకుని కేంద్రం ఆడుతున్న కపట నాటకాన్ని బయటపెడతామని వెల్లడించారు. గుంటూరులో మార్కెట్ సెంటర్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన జయదేవ్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. హిమానీ సెంటర్ నుంచి శారద కాలనీ మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు పెద్దఎత్తున ఈ సైకిల్ ర్యాలీ సాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేసేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు.