రాష్ట్రంలోని సుక్మా జిల్లా పూస్పాల్ పరిధిలోని అటవీప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర గడ్చిరోలిలోని మావోయిస్టుల శిబిరంపై ప్రత్యేక కమెండోలు దాడి చేసి 16 మంది మావోయిస్టులను హతం చేశారు. మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జిల్లాస్థాయి దళ కమాండర్లు డోలేశ్ ఆత్రం అలియాస్ సాయినాథ్, రౌతు విజేందర్ అలియాస్ శ్రీను మృతిచెందారు. భమ్రగఢ్ తాలూకా తాడ్గావ్లోని బొరియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 14మంది నక్సల్స్ మృతిచెందినట్లు మొదట అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలు లభ్యం కావడంతో మృతుల సంఖ్య 16కు చేరింది.