గాల్లోనే ఇంజిన్ పేలినప్పటికీ అదృష్టవశాత్తూ సురక్షితంగా ల్యాండ్ అయిన సౌత్ వెస్ట్ విమానంలో ప్రయాణించిన ప్రయాణికులకు ఆ విమానయాన సంస్థ 5వేల డాలర్ల నష్టపరిహారం, వెయ్యి డాలర్ల ప్రయాణ వోచర్లను ఇవ్వనున్నట్లు తెలిపింది. తమ కస్టమర్లకు ఎంతో విలువ ఇస్తామని, సౌత్ వెస్ట్పై మీ విశ్వాసాన్ని పొందేందుకు తమకు మరో అవకాశం ఇస్తారని భావిస్తున్నానని సంస్థ సీఈఓ గారీ కెల్లీ తెలిపారు. నష్టపరిహారంగా ప్రయాణికులకు 5వేల డాలర్ల చెక్కులు పంపిస్తున్నట్లు వెల్లడించారు. విమానం మంగళవారం డల్లాస్ నుంచి న్యూయార్క్కు బయలుదేరగా టేకాఫ్ అయిన 20 నిమిషాలకే ఫిలడేల్ఫియా సమీపంలో 32వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా గాల్లోనే ఇంజిన్ పేలడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇంజిన్ విడిభాగాలు తాకి విమానం కిటికీ అద్దం బద్దలవ్వగా, కిటికీ పక్కన కూర్చున్న మహిళను గాలి ఒత్తిడి సగం వరకు బయటకు లాగేసింది. తోటి ప్రయాణికులు విశ్వప్రయత్నం చేసి ఆమెను తిరిగి లోపలికి లాగారు. కానీ, తీవ్ర గాయాలపాలైన ఆమె మరణించింది. కాగా ఆ సమయంలో విమానం నడుపుతున్న మహిళా పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చెయ్యడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. విమానం కిందకు దిగగానే అగ్నిమాపక సిబ్బంది ఇంజిన్లోని మంటలను ఆర్పేశారు. ఆ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.