ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వేకువ జామున జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 40మందికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లాలో విద్యార్థులు విహార యాత్రకు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తాపడిన ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలో ప్రైవేటు కంపెనీ బస్సును వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో 10మందికి గాయాలయ్యాయి.
విద్యార్థుల విహార యాత్రలో అపశ్రుతి :
కనిగిరి: ప్రకాశం జిల్లాలోని పెద్దచెర్లోపల్లి మండలం అలవలపాడు వద్ద పాలేరు వంతెనపై ఓ ప్రైవేటు బస్సు కల్వర్టును ఢీకొని అదుపు తప్పి వాగులో బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలుకు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కనిగిరి ఎమ్మెల్యే బాబురావు అధికారులను ఆదేశించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది ఉన్నట్లు సమాచారం. వీరంతా మహానంది, యాగంటికి విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులంతా ఉలవపాడు మండలం కరేడు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
ప్రైవేటు బస్సును ఢీకొన్న వోల్వో బస్సు :
దొరవారిసత్రం: నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నెలబల్లి సమీపంలో జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రైవేటు కంపెనీ బస్సును వోల్వో బస్సు ఢీకొంది. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీసిటీలోని సెల్ఫోన్ కంపెనీకి మహిళా ఉద్యోగులతో వెళ్తున్న బస్సును విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తున్న వెంకటేశ్వర ట్రావెల్స్ వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఉద్యోగినులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 8మంది మహిళలు, ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. క్షతగ్రాత్రులను 108లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.