న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ నాశనం చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోదీ 30వేల కోట్లు ఎగవేసి దేశం విడిచి పారిపోయారన్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం ఆ అంశంపై ఏమీ మాట్లాడలేదన్నారు. నోట్ల రద్దు చేసిన తర్వాత మనం క్యూలో నిలబడ్డామని, 500, వెయ్యి లాంటి పెద్ద నోట్లను రద్దు చేసి.. నీరవ్ మోదీ లాంటి వాళ్ల చేతుల్లో పెట్టారని రాహుల్ ఆరోపించారు. పార్లమెంట్లో ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రధాని జంకుతున్నారన్నారు. రాఫెల్ అంశమైనా లేక నీరవ్ మోదీ అంశమైనా మోదీ పార్లమెంట్లో మాట్లాడలేకపోతున్నారన్నారు. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడిందని తృణమూల్ ఎంపీ డేరిక్ ఒబ్రెయిన్ ఆరోపించారు. నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లోనే అంతా బాగుంటుందన్నారు, కానీ ఏడాదిన్నర దాటినా పరిస్థితి చక్కబడలేదన్నారు. ఇంకా నగదు కొరత ఉందన్నారు.