మంత్రి నారాయణ అండదండలు, వైకాపా బరిలో లేకపోవడం, జిల్లా వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే అనేక మంది పట్టభద్రుల సహకారం చాలనుకొంటున్న పట్టాభి. ఎ తమకున్న చెడ్డపేరు, ఏ ఒక్కరికీ సహాయపడే తత్వం లేకపోవడం, తన పేరు చెప్పి పబ్బం గడుపుకొంటున్నారని అపవాదులతో గెలవగలడా అన్న సందేహంలో మంత్రి నారాయణ. చంద్రబాబుకు నెల్లూరు జిల్లా పట్లా ఎప్పుడూ సదాభిప్రాయం లేదనే చెప్పాలి అందుకు ఉదహరించాల్సిన అవసరం నెల్లూరీయులకు లేదు. రాజకీయ సమీకరణల్లో నెల్లూరు జిల్లాను పూచిక పుల్లగా తీసుకోవడం చంద్రబాబుకు పరిపాటై పోయింది. గతంలో 11 స్థానాలకు 10 సీట్లు సాధించుకొన్నా జిల్లాకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పాలి. ఈ మాట కాస్త ఘాటుగా మాట్లాడితే మళ్లీ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడ్తున్నారని పచ్చనేతలు పిచ్చ ప్రహసానాలకు సిద్ధమైపోతారు నిజం ఎప్పుడూ నిష్టూరంగానే వుంటుంది. నెల్లూరీయుల్లో చంద్రబాబు గూర్చి బలంగా విన్పడే మాట అభివృద్ధి లేదా స్థానిక ప్రజలకు ఉపయోగకరమైన అంశమేదైనా తన ఖాతాలో వేయండి చెడు జరిగి వుంటే వైఎస్ఆర్ ఖాతాలో వేయండి అన్నట్టు వ్యవహరిస్తారని స్థానికుల్లో బలంగా వుంది. ఇక జిల్లాలో చెప్పుకోదగ్గ కేంద్ర మంత్రి నాయకుడుగా కంటే నాయుడుగానే వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి అన్యోనతతో జిల్లాలో మోడీ ప్రభ మసక బారుతుందనేది సత్యం. ఆ అంశాలన్నీ పక్కన బెట్టి ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేసుకొన్న అభ్యర్థి గూర్చి చర్చలోకి వస్తాము. చంద్రబాబు నెల్లూరీయుల పట్ల నిర్లక్ష ధోరణికి నిదర్శనమే పట్టాభి ఎంపిక అని స్పష్టంగా చెప్పవచ్చు. ఇతనికి ఎవ్వరికీ లేనంత చెడ్డ పేరు జిల్లా వ్యాప్తంగా వుంది మరీ ముఖ్యంగా వారి సామాజిక వర్గంలో మరీ ఎక్కువుగా వుండడం హాస్యాస్పదం. స్వగ్రామమైన గండవరంలో ఏ గడపలో కూడా వీరి పేరు చెప్పడానికి ఇష్టపడరు. అంతటి ఘనకీర్తి కల్గిన ఇతనికి ఎమ్మెల్సీ సీటు కేటాయించడం టిడిపి అధినేత మరీ ముఖ్యంగా జిల్లా మంత్రి నారాయణ నెల్లూరీయులను అవమాన పర్చడమే అని చెప్పవచ్చు. నేను నిలబెట్టిన ఆఫీసు బాయ్ను కూడా గెల్పించుకోగలను అని చంద్రబాబు వద్ద మెహర్బాని మాటలు చెప్పి సీటు పట్టాభికి కేటాయింపు చేయించుకొన్నాడు మంత్రి నారాయణ. ఒక రకంగా ఆయన చెప్పింది కూడా కరెక్టే పట్టాభి స్థానంలో ఏ ముక్కు మొహం తెలయని వాడైనా అధికార పార్టీ అండదండలు, వైసిపి పోటీలేని తరుణం, ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వెదజల్లి గెలుపుతో చంద్రబాబు ముందు కాలర్ ఎగరేసే పరిస్థితి వుండేదేమో. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా వుండడంతో నారాయణ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడన్నది కాదనలేని సత్యం. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న హనుమంతరావు తీవ్ర అసంతృప్తితో వున్నాడు. మంత్రి నారాయణ రాజకీయ అరంగేట్రం నుంచి లీగల్ అడ్వైజర్గా అన్నీ తానై వ్యవహరించినా మంత్రి నారాయణ ఏ మాత్రం కరుణ చూపకపోవడం ఆయన అసంతృప్తికి కారణమై వుండవచ్చు. మంత్రి నారాయణ తన సన్నిహితులతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలంటే తన బలం తనకు తెలియాలి అందుకు పట్టాభి నిలిపి గెలిపించుకోవాలి అన్నాడట. ఆయన మనోగతం తెలుసుకొన్న పట్టాభి నెల్లూరులో ఎవర్నీ లక్ష్య పెట్టడం లేదు, మొన్నటికి మొన్న తన ప్రచార సభకు వివేక వచ్చిన గంటకు హాజరు కావడం ఏ మాత్రం జీర్ణం చేసుకోలేక పోతున్నారు అనం సోదరులు. లేడికి కాలం కాక చిక్కింది కాళ్లు లేక అనుకొంటున్నారు. ఉన్నతంగా చదువుకొన్న అనేక మంది నారాయణ విద్యా సంస్థలలో ఇమడలేక పోవడానికి కారకులు పట్టాభి వాళ్ల అన్న విజయభాస్కర్ రెడ్డి. ఇంజనీరింగ్ కాలేజి ప్రొఫెసర్ల పట్ల మెడికల్ కాలేజి డాక్టర్లను చులకనగా చూడడం వీరి పట్ల ఏహ్యభావంతో వున్నారు. ఇక విద్యాసంస్థల్లో పనిచేస్తున్న చిన్న చితకా ఉద్యోగులకు సంవత్సరానికి రూ. 50, 100లు పెంచిన ఘనత వీరికే దక్కుతుంది. ఈ అన్నదమ్ములు ఎవ్వరికీ విలువివ్వరు ఎంచేతనంటే మాకు తెలియని పాఠ్యాంశమని నిస్సిగ్గుగా చెప్పుకొంటారు. ఇటువంటి వారిని సూచించిన ఘనత మంత్రి నారాయణకే దక్కుతుంది. మంత్రి నారాయణ బలహీనతలను తమ గుప్పిట్లో పెట్టుకొని వారి పబ్బం గడుపుతున్న ఈ అన్నదమ్ములు ఆర్థికంగా పరిపుష్టి చెందినా నష్టం లేదు. కానీ ఇప్పటికే మలినమైన రాజకీయాలను ఇంకా మలినం చేసే వారికి పగ్గాలిచ్చి ప్రోత్సహించిన ఘనత మంత్రికే దక్కుతుంది. స్థానికంగా విద్యాసంస్థలో పిల్లల ఫీజు రాయితీ విషయంలో పిల్లల తల్లిదండ్రులు వీరిని సంప్రదించి ఎన్ని రోజులు పడిగాపులు కాచినా వారిని నీచంగా చూసిన సంఘటనలు మర్చిపోలేకున్నారు. గతి లేక పోతే మా సంస్థల్లో ఎందుకు ఏదైనా మీ స్థాయిలో చిన్న చిన్న విద్యాసంస్థల్లో చేర్పించుకోండని ఉచిత సలహాలివ్వడం వీరికే తగును. ఇవన్నీ మర్చిపోయి వీరిని ఆదరిస్తారంటే ఏమో చెప్పలేము, అగ్రదేశమైన అమెరికాలోనే జనాలు ఆకులు పట్టుకొంటున్నారు. మరి ఈ అంశం నెల్లూరీయులు విజ్ఞతకే వదిలేద్దాం. ఇక చిత్తూరు జిల్లాలో చాలా మందికి పట్టాభి పేరే తెలియదు. మంచైనా, చెడైనా ఏదైనా ఫలితాలు ఈ జిల్లా మీదనే ఆధారపడి వుంటాయని అంచేత ఆ జిల్లాలో దృష్టి సారించమని మంత్రి నారాయణ పట్టాభికి సూచించాడట. ఇప్పటికిప్పుడు నెల్లూరు జిల్లాలో నీకు మంచి పేరు తేవడం అంటే కష్టతరమైన పని అంచేత సాధ్యమైనంత వరకు చిత్తూరు జిల్లా ప్రచారం చేసుకోమని ప్రాధేయపడుతున్నాడు మంత్రి నారాయణ. తాను చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తన పరపతిని నీ గెలుపుకు వినియోగిస్తానని మాట ఇచ్చినా పట్టాభి నెల్లూరులో మటం వేసుకొని కూర్చొని నా గెలుపు ఖాయమన్న ధీమాతో వ్యవహరిస్తుండడం మంత్రి నారాయణకు ఈ అంశం తీవ్ర తలనొప్పిగా మారిందంటున్నారు.