న్యూఢిల్లీ: బుధవారం ఉదయం నోయిడా సెక్టార్ 20లోని నివాసంలో తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలిక మృతికి కారణమైన టీచర్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులతోపాటు ఢిల్లీ వాసులు ఢిల్లీ-నోయిడా రహదారిపై పెద్ద ఎత్తన ఆందోళన చేపట్టారు. టీచర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ 5 కిలోమీటర్ల మేర రహదారిని దిగ్బంధించారు. టీచర్ లైంగిక వేధింపులకు గురిచేయడం వల్లే మనస్తాపానికి లోనై తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణం జరిగినా ఇప్పటికీ ఎలాంటి అరెస్ట్ చేయలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నా కూతురు టీచర్ వేధింపులకు గురిచేసినట్లు అబద్దం చెప్పిందని అనుకుంటున్నారా..? పోలీసులు లంచం తీసుకున్నారా..? అని ప్రశ్నించారు. మయూర్ విహార్ ఫేజ్-1లోని అహ్ల్కాన్ పబ్లిక్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఇదిలా ఉంటే ఓ మహిళా టీచర్ బాలికను ఎలా వేధింపులకు గురి చేస్తుందని యాజమాన్యం చెప్పకొస్తుంది.