అమరావతి : ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని తాను కేంద్రానికి విస్పష్టంగా తేల్చి చెప్పానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తనను అభినందించిన ముస్లిం నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన త్రిపుల్ తలాక్ విషయంలో క్రిమినల్ కేసులు పెడతాం అంటూ చట్టం తీసుకురావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని కేంద్రానికి మొట్టమొదట చెప్పింది తానేనని చంద్రబాబు అన్నారు. విభజన హామీలను అమలు చేయమని అడిగితే చులకన చేశారని చంద్రబాబు అన్నారు. ఎన్డీయే నుంచి వైదొలగినందరకు తనను ప్రత్యేకంగా అభినందించిన ముస్లిం నాయకులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రశక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాను బీజేపీతో కలవడానికి కారణం కేవలం రాష్ట్ర ప్రయోజనాలేనని ఆయన అన్నారు. అయితే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరిస్తుంటే ఇంక కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉండటం ఎందుకని బయటకు వచ్చి పోరాడుతున్నానని చంద్రబాబు అన్నారు. వైసీపీవి లాలూ చీ రాజకీయాలని విమర్శించారు. వైకాపా అండ చూసుకుని తెలుగుదేశం పార్టీని అణగదొక్కాలని మోడీ చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.