ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థలైన ఉబెర్, ఓలాలకు చెందిన డ్రైవర్లు రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. మార్చి 18 అర్ధరాత్రి నుంచి తాము సమ్మె చేస్తామని ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని వాళ్లు సూచిస్తున్నారు. వారు సమ్మెకు దిగితే కీలకమైన ముంబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పూణె నగరాల్లో తీవ్ర ప్రభావం పడనుంది. ఓలా, ఉబెర్లు డ్రైవర్లకు పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నాయి. కానీ కంపెనీలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల డ్రైవర్లు తమ పెట్టుబడిని పూడ్చుకోలేకపోతున్నారని ముంబయిలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ వాహతుక్ సేన నిర్వహకులు వెల్లడించారు.
డ్రైవర్లు 5 నుంచి 7 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారని కానీ నెలకు వారు అనుకునే దానికంటే చాలా తక్కువ మొత్తం రాబడిగా వస్తోందని... ట్యాక్సీ సంస్థల నిర్వహణ లోపం వల్లే ఇలా జరుగుతోందని వారు వాపోయారు. ట్యాక్సీ కంపెనీలు తమ వాహనాలకే ముందు ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. ఇతర డ్రైవర్లకు చెందిన వాహనాల కంటే కంపెనీకి చెందిన వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల డ్రైవర్లకు సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఒక్క ముంబయిలోనే ఈ కంపెనీలను 45వేలకు పైగా క్యాబ్స్ ఉన్నాయి. అయితే వ్యాపారంలో ఇబ్బందుల వల్ల ఈ సంఖ్యలో 20శాతం క్యాబ్స్ తగ్గిపోయాయని వారు చెబుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధికంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. దీనిపై ఉబెర్, ఓలా స్పందించలేదు.